తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయింది

వేధింపులు తట్టుకోలేక రెండ్రోజుల క్రితం పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుంనేందుకు యత్నించింది. బంధువులు గమనించి చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు.

Advertisement
Update: 2024-08-19 07:31 GMT

రాఖీ పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆకతాయి వేధింపులకు ఓ అమ్మాయి బలైపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్‌లోని ICU బెడ్‌ మీద నుంచే తమ్ముడికి రాఖీ కట్టి తనువు చాలించింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని తండాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

బాధిత మైనర్ బాలిక కోదాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో పాల్‌టెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా ఓ యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక రెండ్రోజుల క్రితం పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుంనేందుకు యత్నించింది. బంధువులు గమనించి చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. రెండ్రోజులుగా బాలికకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.

కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న అమ్మాయికి తాను పండుగ వరకు బతకను అని అనిపించింది. దీంతో శనివారం రాత్రే తమ్ముడిని, పెద్దనాన్న కుమారుడిని ఆస్పత్రికి పిలిపించుకుని రాఖీ కట్టింది. తమ్ముడి నుదిటిపై ముద్దు పెట్టి అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని మాట తీసుకుంది. అనంతరం కన్నుమూసింది. ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నర్సింహులపేట పోలీసులు ఆకతాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News