టీ 20 తరహాలో టీమిండియా బ్యాటింగ్‌

రెండో టెస్టులో బంగ్లాపై 52 పరుగుల ఆధిక్యంలో భారత్‌

Advertisement
Update:2024-09-30 16:39 IST

బంగ్లాదేశ్‌ తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ లో టీమిండియా టీ 20 తరహా బ్యాటింగ్‌ తో అభిమానులను అలరిస్తోంది. వర్షం కారణంగా మొదటి మూడు రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. నాలుగో రోజు ఆటలో భారత జట్టు ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో అభిమానులకు కనుల విందు చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులతో నాలుగో రోజు (సోమవారం) బ్యాటింగ్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు మరో 139 పరుగులకే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్‌ మన్‌ మొమినుల్‌ హక్‌ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ భూమ్రా 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్‌ దీప్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జడేజాకు ఒక వికెట్‌ దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌ ను భారత్‌ దాటిగా ఆరంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ వీరవిహారంతో మూడు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 11 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ తో 23 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌ లో మెహదీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 51 బంతుల్లో 72 రన్స్‌ చేసిన జైస్వాల్‌ ను హసన్‌ మహ్మద్‌ బౌల్డ్‌ చేశాడు. శుభ్‌ మన్‌ గిల్‌ 39. విరాట్‌ కోహ్లీ 47, కేఎల్‌ రాహుల్‌ 68, రిషబ్‌ పంత్‌ తొమ్మిది, రవీంద్ర జడేజా 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఫస్ట్‌ టెస్ట్‌ లో సెంచరీతో అలరించిన అశ్విన్‌ ఒక పరుగు మాత్రమే చేశారు. ఆకాశ్‌ దీప్‌ 12 పరుగులు, భూమ్రా ఒక్క పరుగుతో క్రీజ్‌ లో ఉన్నారు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో బంగ్లాపై భారత్‌ 52 పరుగుల ఆదిక్యంలో ఉంది. టీమిండియా మూడు ఓవర్లలో 50 పరుగులు చేయగా, 10.1 ఓవర్లలో 100, 18.2 ఓవర్లలో 150, 24.2 ఓవర్లలో 200, 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసింది. ఆకాశ్‌ దీప్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఈ రోజు ఆటలో మరో 21.2 ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌ లో బంగ్లాదేశ్‌ వికెట్లు వేగంగా తీయాలనే గేమ్‌ ప్లాన్‌ లో భారత్‌ ఉంది.

Tags:    
Advertisement

Similar News