బంగ్లా ముందు భారత్‌ భారీ టార్గెట్‌

సెంచరీలతో కదం తొక్కిన శుభ్‌మన్‌ గిల్‌,రిషభ్‌ పంత్‌

Advertisement
Update:2024-09-21 14:59 IST

బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు రిషభ్‌ పంత్‌ (109), శుభ్‌మన్‌ గిల్‌ (119 నాటౌట్‌) సెంచరీలతో అదరగొట్టారు. పంత్‌కు ఇది ఆరో సెంచరీ కాగా.. గిల్‌ ఖాతాలో ఐదోది. 124 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకిన పంత్‌.. బంగ్లా బౌలర్‌ మెహిదీకే రిటర్న్ క్యాచ్‌ ఇచ్చిన పెవిలియన్‌ చేరాడు. దీంతో గిల్‌తో నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. బంగ్లా పేస్‌, స్పిన్‌ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. పంత్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (22 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. దీంతో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ 287\ 4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ముందు 515 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లా 149 పరుగులకే ఆలౌటైన విషయం విదితమే.

భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ టీ బ్రేక్‌ సమయానికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.అనంతరం బూమ్రా బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చిన జకీర్‌ (33) ఔటయ్యారు. షద్మాన్‌ ఇస్లామ్‌ (30 నాటౌట్‌), నజ్ముల్ హుస్సేన్ శాంటో క్రీజ్‌లో కొనసాగుతున్నారు. పర్యాటక జట్టు విజయానికి 440పైగా పరుగులు అవసరం. వికెట్‌ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News