ప్రపంచ కప్పు తెచ్చిన ఆ 5 అంశాలు..

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో భారత్‌ విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
Update: 2024-06-30 10:38 GMT

కల నెరవేరింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అప్పుడెప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో టీమిండియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చింది. ఇప్పుడు మరోసారి పొట్టి ప్రపంచ కప్‌ను రోహిత్‌శర్మ అందించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో భారత్‌ విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు:

1. విరాట్‌ కోహ్లీ

భారత్‌ గెలవడానికి మొదటికారణం విరాట్‌ కోహ్లీ. ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఫైనల్స్‌లో మాత్రం అద్భుతమైన కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఈ మెగా టో​ర్నీలో ఫామ్‌ కోల్పోయాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీపై నమ్మకం కోల్పోలేదు. కెప్టెన్‌ రోహిత్‌ సైతం కోహ్లీని నమ్మాడు. ఫైనల్‌ కోసం రన్స్‌ దాస్తున్నాడని సెమీస్ తర్వాత చెప్పాడు. రోహిత్‌ చెప్పిన మాటను కోహ్లీ నిజం చేశాడు. ఇండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్‌, పంత్‌, సూర్య వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ బయటపడేశాడు. కాస్త స్లోగా ఆడినా.. బలమైన ఇన్నింగ్స్‌ నిర్మించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎండ్‌లో అక్షర్‌ పటేల్‌, దూబే వేగంగా ఆడారంటే కోహ్లీ ఉన్నాడనే ధైర్యమే. మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు కోహ్లీ. కప్పు కొట్టామంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం.

2. పాట్నర్‌షిప్స్‌

రెండో రీజన్ పాట్నర్‌షిప్స్‌. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ – అక్షర్‌ పటేల్‌, కోహ్లీ – శివమ్‌ దూబే మధ్య అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌లు నమోదు అయ్యాయి. రోహిత్‌, పంత్‌, సూర్య తక్కువ స్కోర్లకే అవుట్‌ అయిన తర్వాత.. ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్‌, దూబే మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. అక్షర్‌తో కలిసి 4వ వికెట్‌కు 72 పరుగులు జోడించిన కోహ్లీ.. దూబేతో కలిసి 5వ వికెట్‌కు 57 పరుగులు సాధించాడు. ఈ రెండు అత్భుతమైన భాగస్వామ్యాలు టీమిండియాను మ్యాచ్‌లో నిలబెట్టాయి.

3. బౌలింగ్

మూడో రీజన్ బౌలింగ్. సౌతాఫ్రికాపై టీమిండియా ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిందంటే.. కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్‌ బౌలర్లకే ఇవ్వాలి. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యాలే మ్యాచ్‌ను గెలిపించారు. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. క్రీజులో క్లాసెన్‌, మిల్లర్‌ లాంటి అరవీర భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. అప్పటికే క్లాసెన్‌ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. ఓటమి ఖాయం అనుకున్న టైంలో బుమ్రా మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఒత్తిడికి చిత్తయిన సౌతాఫ్రికా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 16 ఓవర్‌లో 4 పరుగులు, 18వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు ఒక వికెట్‌తో బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పాండ్యా.. క్లాసెన్‌, మిల్లర్‌లను అవుట్‌ చేసి ఇండియాకు విజయం ఖాయం చేశాడు.

4. సూర్య సూపర్ క్యాచ్

నాలుగో రీజన్ సూర్య పట్టిన సూపర్ క్యాచ్. సౌతాఫ్రికాకు చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ ఓవర్లు అయిపోయాయి. హార్ధిక్‌ పాండ్యా చేతిలో బాల్‌ ఉంది. ఎదురుగా డేంజరస్‌ హిట్టర్‌ మిల్లర్‌ ఉన్నాడు. విజయం కష్టమే అనే భావనలో ఫ్యాన్స్ ఉన్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌ను మిల్లర్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. ఆల్‌మోస్ట్‌ సిక్స్‌ వెళ్లిపోయిన బాల్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ మ్యాన్‌లా వచ్చి.. అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. మిల్లర్‌ ఔట్ అవడంతో మ్యాచ్‌ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్‌ సిక్స్ పోయి ఉంటే కచ్చితంగా మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్‌ గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్‌ కూడా ప్రధాన కారణం.

5. రోహిత్ కెప్టెన్సీ

లాస్ట్‌ బట్‌ నాట్‌ ది లీస్ట్... మన సూపర్ హీరో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా.. సరైన సయమంలో బుమ్రాను బౌలింగ్‌కు రప్పించాడు. తర్వాత అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యాను అద్భుతంగా వాడుకున్నాడు. సరైన బౌలింగ్‌ మార్పులు, పర్ఫెక్ట్‌ ఫీల్డ్‌ సెటప్‌తో రోహిత్‌ శర్మ తన మార్క్‌ చూపించాడు. ఏ ఆటగాడిని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్‌ను సౌతాఫ్రికా నుంచి లాక్కున్నాడు రోహిత్‌. సూర్యను లాంగ్‌ ఆఫ్‌లో పెట్టకపోయి ఉంటే మ్యాచ్‌ మనం గెలిచే వాళ్లం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి 17ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ కొట్టడంతో ఇండియా మొత్తం సంబురాల్లో మునిగి తేలుతోంది.

Tags:    
Advertisement

Similar News