బంగ్లా తాత్కాలిక సారథిగా యూనస్‌ ప్రమాణం

గురువారం ఉదయం ఫ్రాన్స్‌ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్‌.. తాత్కాలిక సార‌థిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా బంగ్లాకు రెండోసారి విముక్తి లభించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement
Update: 2024-08-09 04:28 GMT

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ సారథిగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (84) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినట్టయింది. అధ్యక్ష కార్యాలయం ’బంగభబన్‌’లో నిర్వహించిన కార్యక్రమంలో యూనస్‌తో దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రమాణం చేయించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా ఇటీవల త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్టు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు. గురువారం ఉదయం ఫ్రాన్స్‌ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్‌.. తాత్కాలిక సార‌థిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా బంగ్లాకు రెండోసారి విముక్తి లభించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

యూనస్‌ ప్రస్థానమిదీ..

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన యూనస్‌.. ఓ సామాజిక కార్యకర్త, ఆర్థికవేత్త. 1940లో చిట్టగాంగ్‌లో ఆయన జన్మించారు. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి ఆయన చైర్మన్‌గా ఉన్నారు. చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. మైక్రో ఫైనాన్స్‌ బ్యాంక్‌ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ఆయన పొందారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు ఆయనపై పదుల సంఖ్య‌లో కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలుశిక్ష పడింది. 

Tags:    
Advertisement

Similar News