ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి నేడు శంకుస్థాపన

కొందుర్గ్‌ స్కూల్‌ బిల్డింగ్‌ కు భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-10-10 18:06 IST

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ భవన నిర్మాణాలకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్‌ శాంతి కుమారి ప్రకటించారు. గురువారం సెక్రటేరియట్‌ నుంచి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గ్‌ లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క శంకుస్థాపన చేస్తారని సీఎస్‌ ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జీ మంత్రుల ఆమోదంతో శంకుస్థాపన చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాకు చెందిన అందరు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌ నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆంథోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట, జడ్చర్ల నియోజకవర్గాల్లో భవన నిర్మాణాలకు శంకుస్థాపనకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సీఎంవో సెక్రటరీ అజిత్‌ రెడ్డి, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News