రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తున్నది
అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందన్న ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్;
బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన జరుగుతున్నదని, ఈ సర్వేలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. కులగణనపై అభినందించకుండా విమర్శలు చేయడం బాధకరం అన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు మాత్రమే ఇచ్చి అన్ని పథకాలన ఆపేసిందన్నారు. కానీ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రాజెక్టులు వేగంగా ముందుకువెళ్తున్నాయి అన్నారు. సన్న వడ్లు పండించన వారికి రూ. 500 బోనస్ ఇస్తున్నాం. మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. విద్యాశాఖలో సమగ్ర మార్పులు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి మా ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. తొలి పదేళ్లలో తెలంగాణకు చీకటి యుగమని విమర్శించారు. ఇప్పడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయంలో నంబర్వన్.. రైతుల సంక్షేమంలో నంబర్ వన్ అన్నారు. ఉద్యోగ నియామకాలు, పరిశ్రమల పెట్టుబడుల్లో నంబర్ వన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తున్నదన్నారు.