అసెంబ్లీలో గందరగోళం...సభ వాయిదా

జగదీశ్ వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం.. సభను వాయిదా వేసిన స్పీకర్‌;

Advertisement
Update:2025-03-13 12:10 IST

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. అంతకుముందు విప్ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతున్నంత సేపు సభ సజావుగానే సాగింది. వాళ్ల ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ... గవర్నర్‌ ప్రసంగంలో నిజాలు లేవు. బడ్జెట్‌ ముందు గవర్నర్‌ చేసే ప్రసంగం గొప్పగా ఉండాలి. ఆయనతో 36 నిమిషాల్లో 360 అబద్ధాలు చెప్పించారు. గవర్నర్‌ కూడా ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా చదవలేదు అన్నారు. రైతులకు రుణమాఫీ చేశారా? రైతు భరసా ఇచ్చారా? అని జగదీశ్‌ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అధికారపార్టీ ఎమ్మెల్యేల నుంచి రన్నింగ్‌ కామెంట్స్‌ మొదలయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని గతంలో దళితుడిని సీఎం చేస్తాను అన్న కేసీఆర్‌ చేశారా? ఉచిత కరెంట్‌ ఇస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీసీ కులగణనలో కేసీఆర్‌, కేటీఆ్‌ పాల్గొనలేదన్నారు. కేసీఆర్‌ అధికారం కోసం లక్ష వాగ్దానాలు ఇచ్చారని అని ఇష్యూను డైవర్ట్‌ చేశారు.

ఈ సమయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సభా మర్యాదలను అధికారపక్షం పాటించడం లేదని, కాపాడటం లేదని అన్నారు. మేం మాట్లాడినప్పుడుఏ రాసుకుని తర్వాత మాట్లాడవచ్చు. మేము మాట్లాడుతున్నప్పడు అంతరాయం కలిగించవద్దని కోరారు. అధికారపక్షం సభ్యులు మాట్లాడినప్పుడు ఓపికగా విన్నాం. అధికారం మందబలం ఉందని అధికారపక్షం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అధికారపక్షం సభ్యులు ఇలానే ప్రవర్తిస్తే మేము రావాలో వద్దో మీరే నిర్ణయించాలన్నారు. అధికారపక్షం సభ్యులను సభ సక్రమంగా జరిగేలా చూడాలి. డిప్యూటీ సీఎం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సభ సక్రమంగా జరిగేలా చూడాలని తలసాని కోరారు. ఈ క్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. జగదీశ్‌ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ణు బెదిరించేలా మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజలంతా చూస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి లేనివే మాట్లాడితేనే మా సభ్యులు స్పందించారు. పదేళ్లలో వాళ్లేం చేశారు. ఏడాదిలో మేమేం చేశామో చెప్పే ప్రయత్నం చేశారు. 14 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలనలో ఏం చేయలేదో ప్రజలకు చెప్పామన్నారు. నా విషయంలో సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడరని స్పీకర్‌ అన్నారు.

అనంతరం జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభ అందరిది.. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్‌గా మీరు కూర్చొన్నారు. ఈ సభ మీ సొంతం కాదు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఏం మాట్లాడోనో చెప్పండి అని అడిగారు. మిమ్మల్ని ప్రశ్నించడం సభా సంప్రదాయలకు విరుద్ధం కాదన్నారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్‌ మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాల్సిందేనని శ్రీధర్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఆయన అహకారంతో మాట్లాడొద్దు. ఈ రోజు స్పీకర్‌ ఛైర్‌పై దూషించేలా మాట్లాడారు అన్నారు. శ్రీధర్‌ వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగదీవ్‌ ఏం తప్పు మాట్లాడారు అని ప్రశ్నించారు. సభలో సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పు లేదన్నారు. సభ అంటే కాంగ్రెస్‌ పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించింది కాదన్నారు. సభను ఆర్డర్‌లో పెడితేనే నేను మాట్లాడుతాను. స్పీకర్‌ అధికారం గురించి మాట్లాడాలనుకున్నా. సభా సంప్రదాయాలు తేలాలి.. స్పీకర్‌ అధికారాలు తేలాలి. సభ్యుల హక్కులు తేలాలి.. స్పీకర్‌ అధికారాలు తేలాలి. అప్పుడే నేను మాట్లాడుతానని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ... దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించారు. జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాల్ఉ స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత లేదా. స్పీకర్‌ ఏకవచనంతో సంబోధించిన ఆయనను సస్పెండ్‌ చేశాలి. దళితజాతికి క్షమాపణ చెప్పాలి డిమాండ్‌ చేశారు. జగదీశ్ వ్యాఖ్యలపై గందరగోళంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

Tags:    
Advertisement

Similar News