కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. సోషల్ మీడియా వార్

మీరు తప్పు చేశారంటే, కాదు మీరే ముందు చేశారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు నేతలు. పోటాపోటీగా కార్టూన్లు, పోస్టర్లతో హడావిడి చేస్తున్నారు.

Advertisement
Update:2024-06-27 12:38 IST

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పై సెటైరిక్ పోస్టర్లు, కార్టూన్లతో బీఆర్ఎస్ ట్రోలింగ్ మొదలు పెడితే, దానికి కౌంటర్ గా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి జవాబులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి వర్గంపై బీఆర్ఎస్ సెటైర్లు పేల్చింది. తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నారు కానీ, హోం శాఖ, విద్యాశాఖకు మంత్రి లేరని.. రేవంత్ రెడ్డి ఫొటోతో బీఆర్ఎస్ ఓ పోస్టర్ అప్ లోడ్ చేసింది. దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ పడింది.


కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలే మొదటి ప్రాధాన్యత అని, బీఆర్ఎస్ హయంలో దోపిడీ చేయడమే మొదటి ప్రాధాన్యత అని హస్తం పార్టీ కౌంటర్ రెడీ చేసింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రోజు రోజుకీ బీఆర్ఎస్ దిగజారిపోతోందని బదులిచ్చారు కాంగ్రెస్ నేతలు. దిక్కుమాలిన అబద్ధాలు ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉపాధి పొందుతున్న వారు ఇకనైనా దాన్ని మానుకోవాలని, ప్రజా ప్రభుత్వంలో అలాంటి వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో ఏ మంత్రి అయినా, కేసీఆర్ ని కాదని నిర్ణయాలు తీసుకోలేదని, కానీ కాంగ్రెస్ హయాంలో మంత్రులు, అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని, అలాంటి వారిని అవమానిస్తారా అని ప్రశ్నించారు.

ఇక పోచారం చేరికపై కూడా బీఆర్ఎస్ సెటైర్లు పేలుస్తోంది. దేశ భక్తి గల ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరిరక్షణ మొదటి కర్తవ్యం కావాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ.. రాహుల్, రేవంత్, పోచారం కలసి ఉన్న ఫొటోని బీఆర్ఎస్ ట్యాగ్ చేసింది. పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ రాజ్యాంగాన్ని బాగానే పరిరక్షిస్తున్నారంటూ సెటైర్లు వేసింది.


సోషల్ మీడియాలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తగ్గేది లేదంటున్నాయి. పోటాపోటీగా కార్టూన్లు, పోస్టర్లతో హడావిడి చేస్తున్నాయి. మీరు తప్పు చేశారంటే, కాదు మీరే ముందు చేశారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు నేతలు. 

Tags:    
Advertisement

Similar News