పీఏసీ ఛైర్మన్‌ను ఎన్నుకోలేదు.. ఎంపిక చేశారు: ప్రశాంత్‌రెడ్డి

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్‌

Advertisement
Update:2024-09-21 12:55 IST

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగుతున్నది. పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశాంత్ రెడ్డి ,గంగుల కమలాకర్ ,ఎమ్మెల్సీలు ఎల్ .రమణ ,సత్యవతి రాథోడ్ బహిష్కరించారు. పీఏసీకి ఎన్ని నామినేషన్ లు వచ్చాయని బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశ్నించారు. ఛైర్మన్‌గా అరెకపూడిని నియమించడంపై శ్రీధర్‌బాబును నిలదీశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయి ని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సంఖ్య ప్రకారం 5 పేర్లు ఇవ్వమన్నారు. ఇచ్చాం. హరీశ్‌ రావు వేసిన నామినేషన్ ఏమైంది? గాంధీ కి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నిలదీశారు. అన్ని స్పీకర్ విచక్షణాధికారం అని సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ బహిష్కరించాం. అప్రజాస్వామికంగా పీఏసీ ఎంపిక చేశారు. ఛైర్మన్‌ ఎంపిక సమయంలో ప్రతిపక్షనేతను సంప్రదించలేదు. పీఏసీ ఛైర్మన్‌ను ఎన్నుకోలేదు.. ఎంపిక చేశారని మండిపడ్డారు.

2014 లో కాంగ్రెస్ కు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ ఛైర్మన్ గా కేసి వేణుగోపాల్ ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014 లో కాంగ్రెస్ కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం కు ఉన్నారు.. అందుకే వారికే ఛైర్మన్ పదవి ఇచ్చామని తెలిపారు. 2018లో పీఏసీ ఛైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం. ప్రశ్నలకు పీఏసీ లో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే బైకాట్ చేశామన్నారు. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Tags:    
Advertisement

Similar News