రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు
అర్చకుడు రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రంగరాజన్ను అడిగి ఆరోజు ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదన్నారు.దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగరాజన్ను పరామర్శించే సమయంలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఇతర నేతలున్నారు.