రాష్ట్రంలో ఇసుక సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరానికి మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.;
రాష్ట్రంలో ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.గనుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు టీజీఎండీసీ నుండి ఇసుకను సరఫరా చేయాలని అన్నారు.నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన శాండ్ను టీజీఎండీసీయే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మైనర్ ఖనిజాల బ్లాకుల వేలానికి వెంటనే టెండర్లను పిలవాలని ఆయన సూచించారు.గనుల శాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇవాళ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్షలో గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.