బాబు పాలన.. బీఆర్ఎస్ పాజిటివ్ రియాక్షన్

ఇక చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ వెనక కూడా రహస్య అజెండా ఉందని చెబుతోంది బీఆర్ఎస్. గురు దక్షిణ కింద తెలంగాణ పరిశ్రమలు, కంపెనీలను ఏపీకి రేవంత్ రెడ్డి అప్పజెబుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

Advertisement
Update: 2024-07-02 10:56 GMT

ఏపీలో జగన్ మళ్లీ గెలవాలని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కోరుకున్న విషయం తెలిసిందే. సర్వేల్లో కూడా జగనే గెలుస్తారని, బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడా బీఆర్ఎస్ నుంచి వ్యతిరేక కామెంట్లు రాలేదు. తాజాగా ఓ పాజిటివ్ కామెంట్ కూడా బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి వెలువడింది. ఏపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలు, కంపెనీలను ఆ రాష్ట్రానికి తీసుకొస్తోందని పరోక్షంగా బాబు పాలనను బీఆర్ఎస్ మెచ్చుకున్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఘాటుగా విమర్శించింది.


"రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన." అంటూ బీఆర్ఎస్ ట్వీట్ వేసింది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు వచ్చిన కంపెనీలను, పరిశ్రమలను తన్నుకుపోతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇది తెలంగాణ ప్రజలకు చేదువార్త కానీ, ఏపీ ప్రజలు సంతోషించాల్సిన వార్తే. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త పరిశ్రమలు, కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని దీన్నిబట్టి అర్థమవుతోంది. అందులోనూ బీఆర్ఎస్ అంత ఆషామాషీగా ట్వీట్ వేయదు కాబట్టి.. ఆ వార్తలో కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉండే ఉంటుంది.

ఇక చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ వెనక కూడా రహస్య అజెండా ఉందని చెబుతోంది బీఆర్ఎస్. గురు దక్షిణ కింద తెలంగాణ పరిశ్రమలు, కంపెనీలను ఏపీకి రేవంత్ రెడ్డి అప్పజెబుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతోందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News