ఆ మంత్రికి రోజుకు రూ.50 లక్షల ముడుపులు

రోజుకి రూ.50లక్షలు మంత్రి పొన్నంకి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.

Advertisement
Update:2024-06-11 14:17 IST

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్రమాల మేత మేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకోసం మంత్రికి ముడుపులు చెల్లిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమేనన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.


ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ ని తరలించేందుకు అనుమతించిన పరిమాణం కంటే రెట్టింపు లోడ్ తో లారీలు వెళ్తున్నాయని అన్నారు కౌశిక్ రెడ్డి. ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారని చెప్పారు. అయినా మంత్రి తీరు మారలేదన్నారు. మంత్రికి ముడుపులు చెల్లించడం వల్లే ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందన్నారు. రోజుకి రూ.50లక్షలు మంత్రికి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.


వివిధ సందర్భాల్లో పొన్నం హావభావాలను కూడా గుర్తు చేశారు కౌశిక్ రెడ్డి. పొన్నంలాగే మాట్లాడుతూ, చేతులు ఊపుతూ సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ మంత్రి వర్గంలో పొన్నం దందా తాము బట్టబయలు చేశామన్నారు. తాను స్వయంగా లారీలను అడ్డుకున్నా కూడా తూతూ మంత్రంగా రెండు లారీలను సీజ్ చేసి, మిగతా వాటిని వదిలిపెట్టారన్నారు. మంత్రి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు పనులకు సహకరించాలని చెబుతున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News