టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు
టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉన్నది. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందన్న మంత్రి జూపల్లి
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులు పర్యవేక్షిస్తున్నారు. లోకో ట్రైన్లో సొరంగం లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. సొరంగంలో నీరు, బురద తోడేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నారు. సహాయక బృందాలు రాత్రి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. రెస్క్కూ టీమ్లు టన్నెల్ బోర్ మిషన్కు చేరువగా వెళ్లాయి. టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉన్నది. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చింది. అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితి. కార్మికులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. చివరి వరకు మా ప్రయత్నాలు కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.