కారును ఢీకొన్న ఆటో.. ముగ్గురు మృతి – గుంతను తప్పించే క్రమంలో ప్రమాదం

రోడ్డుపై మరమ్మతుల కోసం తవ్వి వదిలేసిన గుంతను తప్పించే క్రమంలో ఆటో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

Advertisement
Update:2024-07-06 09:30 IST

రోడ్డుపై మరమ్మతుల కోసం తవ్వి వదిలేసిన గుంతను తప్పించే క్రమంలో ఆటో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్‌తో కలిసి ఆరుగురు ప్రయాణిస్తున్న ఆటో తొర్రూరు నుంచి బీరిశెట్టిగూడెం వైపు వెళుతోంది.

దంతాలపల్లి శివారు వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై బీటీ దెబ్బతినడంతో దానిని మరమ్మతుల కోసం తవ్వి వదిలేశారు. ఆటో ఆ గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో తొర్రూరు మండలం వెల్లికట్టకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లేశ్‌ (38), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడేనికి చెందిన పగిండ్ల కుమార్‌ (38), వాల్యా తండాకు చెందిన భూక్యా నరేష్‌ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే ఆటోలో ఉన్న కుమార్‌ భార్య మంజుల, కుమార్తె అంజలి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News