75 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ బీసీల కోసం ఏం చేసింది

యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ నాయకుడు దుగుట్ల నరేశ్‌

Advertisement
Update:2024-12-28 18:56 IST

75 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ నాయకుడు దుగుట్ల నరేశ్‌ కుమార్‌ ప్రశ్నించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడితే తప్పేముందని ప్రశ్నించారు. ఆమెపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 3న సావిత్రి భాయి ఫూలే జయంత్య్సువాలను పురస్కరించుకొని కవిత ఇందిరా పార్క్‌ వద్ద భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే తప్పులను ఎవరూ ప్రశ్నించొద్దా అని నిలదీశారు. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసే కాంగ్రెస్‌ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులు కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు కోసం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల కోసం ఏడాదిలో ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో శాలివాహన, రజక, సగర, పద్మశాలితో పాటు ఇతర బీసీ సంఘాల నాయకులు విజేందర్ సాగర్, పెద్దాపురం కుమార స్వామి, జల్లా నరేందర్, మర్పంగా వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News