కనుచూపు మేరకు వెళ్లినా కనిపించని జాడ
48 గంటలు గడిచినా కానరాని 8 మంది సిబ్బంది ఆచూకీ
ఎస్ఎల్బీసీ లో ప్రమాదం జరిగి దాదాపు 48 గంటలు కావొస్తున్నది. అయినా సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఇప్పటికే భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్ఫోర్స్ విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు మూడు హెలికాప్టర్లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బైటికి తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు.
లోకోట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నది. టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మట్టి, బురద, నీరు భారీగా నిలిచింది. టన్నెల్లో రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య నీరు భారీగా నిలిచింది. సిబ్బంది ప్రత్యేకంగా పంపులు తెప్పించి డీవాటరింగ్ చేస్తున్నది. వంద మీటర్ల బురదను దాటి అర్ధరాత్రి టీబీఎంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రవేశించాయి. పేరుకుపోయిన మట్టిని తీస్తే మళ్లీ కూలే ప్రమాదం ఉన్నద అనేదానిపై సమీక్ష చేస్తున్నారు. చిక్కుకున్న సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.