తన సొంత ఖర్చుతో దివ్యాంగుడికి.. జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత
దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. దివ్యాంగుడైన చిర్రా సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా రామానుజపురంలో సొంతం ఖర్చులతో ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేయించారు. మహబూబాబాద్ జిల్లా జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రామానుజాపురం వెళ్లిన ఆమె.. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి ప్రారంభించారు. చిర్రా సతీశ్కు చిన్నప్పటి నుంచే కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మైస్థెర్యంతో డిగ్రీ పూర్తి చేశారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తనకు ల్యాప్టాప్, జిరాక్స్ మిషన్ కొనిపించి స్వయం ఉపాధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్పీ కవితకు మెస్సేజ్ చేశారు. ఆమె వెంటనే స్పందించి అభయమిచ్చారు. వారం కూడా తిరగకముందే ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్కు కావాల్సిన పరికరాలను సమకూర్చారు. కాగా, ఈ ఇంటర్నెట్ సెంటర్కు తన అభిమాన నేత కేసీఆర్ పేరును సతీశ్ పెట్టారు. పెద్ద మనస్సుతో సాయం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కవితకు తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పారు.ఇంటర్నెట్-జీరాక్స్ సెంటర్ ఏర్పాటుపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ మనకు నేర్పిన బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిర్రా సతీష్కి స్వయం ఉపాధి కల్పించడం తన బాధ్యతగానే భావించానని తెలిపారు. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు.