హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుచెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.;
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుచెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్లు మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
తద్వారా 100 శాతం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఈ ఓటీఎస్ ద్వారా పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ వల్ల సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. జీహెచ్ఎంసీ.. ఈ సారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని భావిస్తోంది.