ఢిల్లీకి మూటలు పంపేలా ఈ బడ్జెట్
ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమౌతుందన్న కేటీఆర్;
ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్లా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నీ తెలివి తక్కువతనం వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం తగ్గిపోయింది. మీడియా ముందు రంకెలు వేయడం కాదు.. అంకెలు ఎందుకు ఆగమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ సందర్భంగా చెప్పినట్లు మీ బడ్జెట్ అంచనాలకు ఎందుకు చేరుకోలేకపోయింది. నమ్మి ఓట్లు వేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. పదేండ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, చేతగానితనానికి నిలువుటద్దం ఈ బడ్జెట్. వీరి అసమర్థతత, చేతకానితనం వల్ల ఆకాశం నుంచి పాతాళం వైపు ఆర్థిక వ్యవస్థ పోతున్నదంటే కచ్చితంగా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కేసీఆర్ ఏడాదికి రూ. 40 వేల కోట్ల అప్పు చేస్తే రంకెలు వేశారు. కానీ ఇవాళ ఒక్క ఏడాదికి లక్షా 60 వేల కోట్ల అప్పు చేసి కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఈ బడ్జెట్ను చూస్తుంటే లక్షల కోట్ల అప్పు టార్గెట్ కనబడుతున్నట్లు ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని పెద్దలు చెబుతారు. కానీ ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమౌతుంది. సంక్షేమానికి సమాధి.. అభివృద్ధికి అడ్రస్ గల్లంతు.. ప్రజలకు ఇచ్చిన హామీలకు ఘోరీ కట్టి.. పార్టీ కార్యకర్తలకు మాత్రం వీళ్ల అబ్బ సొత్తు.. పప్పు బెల్లం లాగా 6 వేల కోట్లు పంచి పెడుతారట. కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. పప్పు బెల్లంలాగా పంపి పెడుతామంటే.. అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అవుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.