కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజయం సాధించారు;
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపోందారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని హస్తం పార్టీ కోల్పోయింది.
ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.