నిన్న రాహుల్ ర్యాగింగ్.. నేడు మోదీ వంతు

ఇక కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని, మూడుసార్లు కూడా 100కంటే తక్కువ స్కోర్ సాధించిందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.

Advertisement
Update: 2024-07-02 14:29 GMT

పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఒకరినొకరు టార్గెట్ చేసుకుని మరీ సభలో నవ్వులు పూయిస్తున్నారు. సీరియస్ విమర్శలు చేసుకుంటున్నా కూడా వారి హావభావాలు, మాటలు.. సభలో సందడి సృష్టించాయి. నిన్న రాహుల్ గాంధీ హవా కొనసాగింది, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీపై ఆయన చెణుకులు విసిరారు. ఈరోజు మోదీ వంతు వచ్చింది. రాహుల్ గాంధీ సభలో సభ్యుల్ని కౌగిలించుకుంటారని, కన్నుగీటుతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మోదీ.


మీ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా..?

ఇక కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని, మూడుసార్లు కూడా 100కంటే తక్కువ స్కోర్ సాధించిందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరాన్న జీవిగా కాంగ్రెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన స్కోర్ 99/100 అనుకుంటుందని, కానీ కాంగ్రెస్ స్కోర్ 99/543 అని కౌంటర్ ఇచ్చారు మోదీ.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడిన మోదీ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోందని, భారత్‌ ప్రథమ్‌ అనే తమ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు మోదీ. తాము అధికారంలోకి వచ్చాకే తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేశామని గుర్తు చేశారు. 

Tags:    
Advertisement

Similar News