ఆ ఐఏఎస్‌ లకు నో రిలీఫ్‌

ఎలాంటి ఊరటనివ్వని తెలంగాణ హైకోర్టు

Advertisement
Update:2024-10-16 16:13 IST

డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌ అధికారులకు ఎలాంటి రిలీఫ్‌ దక్కలేదు. డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ససేమిరా అన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అలాట్‌ చేసిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, రొనాల్డ్‌ రాస్‌, ఆమ్రపాలి తెలంగాణలో, తెలంగాణకు కేటాయించిన సృజన, శివశంకర్‌, హరికిరణ్‌ ఏపీలో పని చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన సివిల్‌ సర్వెంట్లు అదే రాష్ట్రంలో రిపోర్ట్‌ చేయాలని ఇటీవల డీపీవోటీ ఆదేశించింది. రిపోర్ట్‌ చేసేందుకు బుధవారం డెడ్‌ లైన్‌ గా పెట్టింది. డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఐఏఎస్‌ లు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించారు. డీవోపీటీ ఆదేశాలను సివిల్‌ సర్వెంట్లు పరిశీలించి తారాలని క్యాట్‌ ఆదేశించింది. ఈ కేసులో సమగ్ర అఫడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. క్యాట్‌ లో ఊరట దక్కకపోవడంతో ఐఏఎస్‌ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. జస్టిస్‌ అభినంద్‌ షావిలి ఐఏఎస్‌ల లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ లపై వాదనలు విన్నారు. క్యాట్‌ లో నవంబర్‌ 4న విచారణ ఉన్నందున అప్పటి వరకు పిటిషనర్లను రిలీవ్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరుపు అడ్వొకేట్‌ విజ్ఞప్తి చేశారు. డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని.. వివాదాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జస్టిస్‌ షావిలి స్పష్టం చేశారు. ముందుగా ఎవరికి అలాట్‌ చేసిన స్టేట్‌ లో వారు రిపోర్ట్‌ చేయాలని ఆదేశింశించారు. సివిల్‌ సర్వెంట్లు బాధ్యతాయుతమైన అధికారులని.. ఎవరు ఎక్కడ పని చేయాలనేది డీవోపీటీనే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ''మీ అభ్యర్థనను మరోసారి పరిశీలించాలని డీవోపీటీకి ఆదేశాలు ఇవ్వాలా అని పిటిషనర్లను కోరారు. రిలీవ్‌ చేసేందుకు 15 రోజులు గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు డీవోపీటీకి లేఖ రాశాయని అడ్వొకేట్‌ కోర్టుకు నివేదించారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఐఏఎస్‌ లు అలాట్‌ చేసిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని జస్టిస్‌ షావిలి మరోసారి స్పష్టం చేశారు .ఐఏఎస్‌ల పిటిషన్‌ లపై క్యాట్‌ స్టే ఇవ్వకపోవడం సరైనదేనని.. దానిపై పూర్తి వివరాలతో క్యాట్‌ లోనే కౌంటర్‌ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ శర్మ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ షావిలి ఐఏఎస్‌ అధికారుల పిటిషన్‌ ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కకపోవడంతో నలుగురు ఐఏఎస్‌ అధికారులను రిలీవ్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జీఏడీ సర్వీసెస్‌ వింగ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లకు రిలీవింగ్‌ ఆర్డర్లు సిద్ధం చేస్తోంది. ఐఏఎస్‌ల అంశంపై చర్చించేందుకు ఉదయం సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. రొనాల్డ్‌ రాస్‌ ఎనర్జీ సెక్రటరీగా, ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గా పని చేస్తున్నారు. ఈ రెండు కీలక పోస్టులు కావడంతో వారి స్థానాల్లో ఎవరిని నియమించాలనే అంశంపైనా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. రిలీవ్‌ అయ్యే నలుగురు ఐఏఎస్‌ ల స్థానంలో కొత్త వాళ్లకు పోస్టింగ్‌ ఇస్తూ బుధవారం రాత్రి లేదా గురువారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News