భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు

దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే అని తెలిపింది. దుస్తుల అమ్మకాల్లో 10 శాతం వివాహాల గురించేనని పేర్కొంది.

Advertisement
Update: 2024-07-01 03:26 GMT

భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫ‌రీస్ తెలిపింది. భారత్‌లో సగటు పౌరులు చదువుతో పోలిస్తే పెళ్లికే రెండింతలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని వివరించింది. దీనిపై చేపట్టిన తన అధ్యయనాన్ని ఒక నివేదిక ద్వారా వెల్లడించింది. భారతీయులు ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఆ సంస్థ తెలిపింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని ఈ సందర్భంగా అంచనా వేసింది.

భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. చైనాలో 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ పరిమాణం రెండింతలు ఉంటుందని తెలిపింది. ఒకవేళ వివాహాలను ప్రత్యేక రిటైల్‌ కేటగిరీగా వర్గీకరిస్తే.. ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని వివరించింది.

అంతర్జాతీయ స్థాయి ఖరీదైన ప్రదేశాలు, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలతో భారత వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని జెఫ‌రీస్‌ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పుంజుకుంటాయని పేర్కొంది. దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే అని తెలిపింది. దుస్తుల అమ్మకాల్లో 10 శాతం వివాహాల గురించేనని పేర్కొంది. పెళ్లికి 6–12 నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయని, గరిష్ఠంగా 50 వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది.

పెళ్లిని ప్రతిష్టాత్మకంగా భావించే భారతీయులు తాహతుకు మించి ఖర్చు చేస్తారని నివేదిక వెల్లడించింది. భారత్‌లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. స్థోమతను బట్టి ఇది అంతకంతకూ పెరుగుతుందని పేర్కొంది. అదే అమెరికాలో విద్యపై చేసే వ్యయంతో పోలిస్తే వివాహంపై చేసే ఖర్చు సగమేనని వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News