భారీ నష్టాల్లో సూచీలు..10 లక్షల కోట్లు ఆవిరి
1000కి పైగా పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్.. 23072.60 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేటు రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్లోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.
సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కూడా 23 వేల స్థాయికి చేరింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్ 1041.౭౮ పాయింట్ల నష్టంతో 76270.02 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 309.00పాయింట్ల నష్టం వద్ద 23072.60 ట్రేడవుతున్నది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లూ రెడ్లో ఉన్నాయి. జొమాటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం సుమారు 10 లక్షల కోట్లు ఆవిరై రూ. 408 లక్షల కోట్ల చేరింది.