జగన్‌ లాంటి నాయకుడు ఇకముందు పుట్టడు.. పుట్టబోడు

పవన్‌ కల్యాణ్‌కి షూటింగ్‌ కోసమే ఎమ్మెల్యే పదవి కావాలని ముద్రగడ విమర్శించారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడయ్యే కులం అంటూ పవన్‌ కల్యాణ్‌ కించపరిచేలా మాట్లాడాడని ఆయన మండిపడ్డారు.

Advertisement
Update:2024-05-03 14:57 IST

జగన్‌ లాంటి నాయకుడు ఇకముందు పుట్టడు.. పుట్టబోడని వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ఊపిరినిస్తున్నాయని ఆయన చెప్పారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడే కుటుంబమని ఆయన తెలిపారు. ప్రస్తుత కాలంలో గాని, రాబోయే కాలంలో గాని ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టే నాయకుడు ఎవరూ ఉండరని ఆయన ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌కి షూటింగ్‌ కోసమే ఎమ్మెల్యే పదవి కావాలని ముద్రగడ విమర్శించారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడయ్యే కులం అంటూ పవన్‌ కల్యాణ్‌ కించపరిచేలా మాట్లాడాడని ఆయన మండిపడ్డారు. జనసేన నాయకులు తన ఇంట్లో కూడా కుటుంబ చిచ్చు పెట్టారని ఆయన విమర్శించారు. అయినా తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తెతో ఆమె మామగారు, జనసేన నాయకులు తన గురించి తప్పుగా మాట్లాడించారని ఆయన చెప్పారు.

తన కుమార్తెకు ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచే తను తన ఆస్తి కాదని, తన కుమారుడు మాత్రమే తన ప్రాపర్టీ అని ముద్రగడ స్పష్టం చేశారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని స్పష్టంచేశారు. తాను భయపడే వ్యక్తిని కాదని, భయపడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. తనకు ఎలాంటి పదవీ కాంక్ష లేదని, వైఎస్‌ జగన్‌కి తోడుగా ఉండటానికే తాను వచ్చానని ఆయన వివరించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన పేరు ముద్రగడ పద్మనాభంగా ఉండాలా లేదా ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఉండాలా అనేది మీరే నిర్ణయించాలి.. అంటూ ఓటర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News