వారానికోసారి ఢిల్లీ వెళ్లే సీఎం ఎవరు లేరు..ఒక్క రేవంత్రెడ్డి మాత్రమే : కిషన్రెడ్డి
భారత దేశ చరిత్రలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డైరక్షన్లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప కాంగ్రెస్ సర్కార్ కొత్త ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదని కిషన్రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వత్యిరేకత వచ్చిందని విమర్శించారు.
హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 2014 తర్వాత మండలిని బీఆర్ఎస్ పార్టీ తమకు మద్దతుగా మార్చుకుందన్నారు. పోరాటం చేసే వారు లేకుండా తమకు మద్దతుగా ఉన్నవారినే ఆ పార్టీ ఎంచుకుందని ఆరోపించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2500 సాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు ఫీజు రియింబర్స్మెంట్స్, రుణమాఫీ ఇలా చెప్పుకుంటూ ఏదీ సక్రమంగా అమలు చేయడం లేదని.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పారు.