ప్రపంచ విలువిద్యలో భారత మహిళల 'గోల్డెన్ హ్యాట్రిక్'!

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

Advertisement
Update: 2024-06-23 05:14 GMT

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

2024 ప్రపంచ విలువిద్య పోటీల మహిళల టీమ్ విభాగంలో భారత్ బంగారు వేట కొనసాగుతోంది. మూడుమాసాల వ్యవధిలో మూడో బంగారు పతకం గెలుచుకోడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.

మూడో అంచెలోనూ తిరుగులేని భారత్..

మహిళల విలువిద్య కాంపౌండ్ విభాగంలో తెలుగుతేజం జ్యోతి సురేఖ వెన్నం, అదితీ స్వామి, పర్నీత్ కౌర్ లతో కూడి భారతజట్టుకు ఎదురేలేకుండా పోయింది.

ప్రపంచ పోటీలను నాలుగు అంచెలుగా, నాలుగు వేర్వేరు దేశాలు వేదికలుగా నిర్వహిస్తారు. 2024 ప్రపంచ విలువిద్యలోని మొదటి మూడు అంచెల పోటీలలోనూ భారతజట్టే బంగారు విజేతగా నిలిచింది.

ఫైనల్లో భారతజట్టు 232- 229 పాయింట్లతో ఎస్తోనియాజట్టును చిత్తు చేసింది. లీజెల్ జాట్మా, మీరి మారిటా పాస్, మారిస్ టెస్ట్ మ్యాన్ లతో కూడిన ఎస్తోనియాజట్టు.. ఏ దశలోనూ భారత్ కు సరిజోడీ కాలేకపోయింది.

చైనాలోని షాంఘై వేదికగా జరిగిన ప్రపంచకప్ స్టేజ్-1 పోటీలలో తొలి స్వర్ణం సాధించిన భారతజట్టు..దక్షిణ కొరియాలోని యోచియోన్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ రెండో అంచెలోనూ బంగారు పతకం అందుకొంది.

2024 ఏప్రిల్, మే మాసాలలో రెండు స్వర్ణాలు సాధించిన భారత మహిళలు ..జూన్ నెలలో సైతం మూడో అంచె స్వర్ణంతో గోల్డెన్ హ్యాట్రిక్ రికార్డు సాధించారు.

విజయవాడ వండర్ కు మూడో స్వర్ణం..

ప్రపంచ విలువిద్య పోటీలలో భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న విజయవాడ వండర్ ఆర్చర్ జ్యోతి సురేఖ..గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. భారత జట్టు మూడుకు మూడు అంచెలలోనూ విజేతగా నిలవడం, బంగారు పతకాలు సాధించడంలో ఈ విజయవాడ ఆర్చర్ ప్రధానపాత్ర పోషించింది.

గతేడాది జరిగిన ఆసియా క్రీడల విలువిద్య వ్యక్తిగత, మహిళల టీమ్, మిక్సిడ్ టీమ్ అంశాలలో బంగారు పతకాలు సాధించిన ఏకైక ఆర్చర్ గా రికార్డు నెలకొల్పిన జ్యోతి.. ప్రస్తుత 2024 సీజన్లోనూ అదేజోరు కొనసాగిస్తోంది.

2024-షాంఘై ప్రపంచ మీట్ స్టేజ్ -1 పోటీలలో సైతం జ్యోతి సురేఖ 146కు 146 పాయింట్లు సాధించడం ద్వారా మూడు బంగారు పతకాలు సొంతం చేసుకోంది.

మహిళల వ్యక్తిగత విభాగం గోల్డ్ మెడల్ పోరులో మెక్సికోకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ యాండ్రియా బాసెరాతో జరిగిన షూట్-ఆఫ్ రౌండ్లో 146 కు 146 పాయింట్లు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొంది.

మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం..

మహిళల టీమ్ విభాగం గోల్డ్ మెడల్ పోరులో జ్యోతీ, అదితీ గోస్వామి, ప్రణీత్ కౌర్ లతో కూడిన భారతజట్టు 236- 225 పాయింట్ల తేడాతో ఇటలీని చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది.

మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం సాధించడంలో జ్యోతి సురేఖ్ ప్రధానపాత్ర వహించింది. ఎస్తోనియాపై భారత్ 158- 157 పాయింట్లతో నెగ్గడం ద్వారా స్వర్ణపతకం సంపాదించింది.

పురుషుల విభాగంలో సైతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది. అభిషేక్ వర్మ, ప్రియాంశు,ప్రథమేశ్ ఫ్యూజీ లతో కూడిన భారతజట్టు 238- 231 పాయింట్లతో నెదర్లాండ్స్ ను అధిగమించింది.

విజయవాడ నుంచి ప్రపంచస్థాయికి....

మొత్తం మూడు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించడం జ్యోతి సురేఖకు ఇదే మొదటిసారికాదు. గత ఆసియా క్రీడలతో పాటు..ప్రస్తుత ప్రపంచ విలువిద్య పోటీలలో సైతం ఈ విజయవాడ ఆర్చర్ గోల్డెన్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

11 సంవత్సరాల వయసులో విజయవాడ వేదికగా విలువిద్య క్రీడలో సాధన మొదలు పెట్టిన సురేఖ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. కాంపౌండ్ విభాగంలో మేటి మహిళా ఆర్చర్ గా గుర్తింపు తెచ్చుకొన్న సురేఖ గత 13 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మొత్తం 40కి పైగా అంతర్జాతీయ విలువిద్య పోటీలలో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.

ఇందులో 6 ప్రపంచ టోర్నీలు, రెండు ఆసియా క్రీడలు, 20 ప్రపంచకప్ పోటీలు, 5 ఆసియా విలువిద్య పోటీలు, 3 ఆసియాకప్ టోర్నీలు, రెండు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు, రెండు జూనియర్ ప్రపంచకప్ టోర్నీలు, దక్షిణాసియా క్రీడలు సైతం ఉన్నాయి.

24సార్లు జాతీయ విలువిద్య పోటీలలో పాల్గొన్న సురేఖ ఏకంగా 58 పతకాలు సాధించింది. ఇందులో 36 స్వర్ణ, 13 రజత, 9 కాంస్యాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News