ప్రపంచ టెస్టులీగ్ లో భారత్ టాప్!

ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ పాయింట్ల పట్టికలో రన్నరప్ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొమ్మిదిదేశాల లీగ్ లో రోహిత్ సేన జోరు టాప్ గేర్ అందుకొంది.

Advertisement
Update: 2024-08-25 10:55 GMT

ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ పాయింట్ల పట్టికలో రన్నరప్ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొమ్మిదిదేశాల లీగ్ లో రోహిత్ సేన జోరు టాప్ గేర్ అందుకొంది.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఐసీసీ నిర్వహిస్తున్న టెస్టు లీగ్ ( 2023-25)లో వరుసగా మూడోసారి ఫైనల్స్ చేరడానికి రెండుసార్లు రన్నరప్ భారత్ ఉరకలేస్తోంది.

ఇప్పటి వరకూ ఆడిన 9 టెస్టుల్లో 6 విజయాలతో 68.52 విజయశాతం, 74 పాయింట్లతో భారత్ లీగ్ టేబుల్ టాపర్ గా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

టెస్టు హోదా పొందిన దేశాల సమరం...

ఐసీసీ నుంచి పూర్తిస్థాయి టెస్టు హోదా పొందిన తొమ్మిది ( భారత్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్ ) దేశాల జట్ల నడుమ గత నాలుగేళ్లుగా ప్రపంచ లీగ్ టైటిల్ పోటీలు నిర్వహిస్తున్నారు.

మొత్తం 9 జట్ల నడుమ జరిగే ఈ లీగ్ లో ఒక్కో టెస్టు విజయానికి 12 పాయింట్లు, టైగా ముగిసే 6 పాయింట్లు, డ్రాగా మ్యాచ్ ముగిస్తే రెండుజట్లకూ చెరో 4 పాయింట్లు చొప్పున ఇస్తున్నారు. సాధించిన విజయాలు, విజయాల శాతాన్ని బట్టి పాయింట్లు ఇస్తున్నారు. స్లోఓవర్ రేట్ కు పాయింట్ల కోతను సైతం విధిస్తున్నారు.

రెండుసార్లు రన్నరప్ గా భారత్...

ఐసీసీ టెస్టు లీగ్ మొదటి రెండుటోర్నీలలోనూ ఫైనల్స్ చేరిన ఏకైకజట్టుగా భారత్ నిలిచింది. అయితే..రెండుకు రెండుసార్లు రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లీగ్ ప్రారంభ టోర్నీ ఫైనల్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ కు..రెండోసీజన్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో రోహిత్ శర్మ నాయకత్వంలోనూ పరాజయం తప్పలేదు.

ప్రస్తుత 2023- 25 లీగ్ ఫైనల్స్ కు సైతం చేరటమే కాదు...టైటిల్ విజేతగా నిలవాలన్న పట్టుదలతో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 9 టెస్టుల్లో భారత్ 6 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రా రికార్డుతో నిలిచింది.

68.2 విజయశాతం, 74 పాయింట్లతో లీగ్ టేబుల్ అగ్రస్థానంలో రోహిత్ సేన కొనసాగుతోంది. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది.

రెండోస్థానంలో ఆస్ట్ర్రేలియా....

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 12 టెస్టుల్లో ఆస్ట్ర్రేలియా 8 విజయాలు, 3 పరాజయాలు, ఓ డ్రాతో సహా 62.50 విజయశాతం, 90 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది.

తొలిసీజన్ చాంపియన్ న్యూజిలాండ్ 6 టెస్టుల్లో 3 విజయాలు, 3 పరాజయాలతో 36 పాయింట్లు, 50 విజయశాతంతో మూడో స్థానంలో నిలిచింది.

నాలుగో స్థానంలో ఇంగ్లండ్....

శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్ లోని తొలిటెస్టులో 5 వికెట్ల విజయం సాధించడం ద్వారా 69 పాయింట్లు, 41.07 విజయశాతంతో నాలుగో స్థానానికి చేరుకోగలిగింది.

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు వరకూ 14 మ్యాచ్ లు ఆడి7 విజయాలు 6 పరాజయాలు, ఓ డ్రా ఫలితాలను నమోదు చేసింది. లీగ్ టేబుల్ 5వ స్థానంలో శ్రీలంక, 6వ స్థానంలో దక్షిణాఫ్రికా, 7వ స్థానంలో పాకిస్థాన్, 8వ స్థానంలో బంగ్లాదేశ్, 9వ స్థానంలో వెస్టిండీస్ జట్లు పోరాడుతున్నాయి.

టెస్టు క్రికెట్లో టాప్ ర్యాంకర్ భారత్...త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ తో పాటు...డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగే కీలక సిరీస్ లో విజయాలు సాధించగలిగితేనే వరుసగా మూడోసారి టెస్టు లీగ్ ఫైనల్స్ చేరుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News