సునీతా,విల్మోర్ భూమ్మీద ల్యాండయ్యే టైం చెప్పిన నాసా
మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నట్లు నాసా తాజా ప్రకటన;
సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో వారి తిరుగు పయనం మొదలవ్వనున్నది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా తాజా అప్డేట్ ఇచ్చింది.
సునీత, విల్మోర్ను తీసుకురావడానికి రోదసీలోకి వెళ్లిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన విషయం విదితమే. క్రూ-10 మిషన్లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది.
క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు ప్రయాణం ఇలా...
- క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగల్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఈ స్సేస్ షిప్ విజయవంతంగా విడిపోయి తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది.
- సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందికి వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్యూల్ దిగుతుంది. దానిలోనుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బైటికి తీసుకొస్తారని నాసా వెల్లడించింది.