ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
రాష్ట్రపతి పాలన పెడుతారా.. కొంత సీఎంను ఎంపిక చేస్తారా?.. కొనసాగుతున్న ఉత్కంఠ
ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ఏ ఇద్దరు బీజేపీ ముఖ్య నాయకులు కలిసినా ఇదే చర్చ.. అక్కడ రాష్ట్రపతి పాలన పెడుతారా? పాలన పగ్గాలు కొత్తగా ఎవరి చేతుల్లోనైనా పెడుతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఏం చేస్తే మంచిదనే కోణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్నదని కూడా చెప్తున్నారు. ఇంతకీ ఏ రాష్ట్రం గురించి అనుకుంటున్నారా? ఏ రాష్ట్రం ఏముంది.. మొన్ననే ఎలక్షన్స్ జరిగి.. బీజేపీ గెలిచిన రాష్ట్రం ఢిల్లీనే కదా అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులే కాలేసినట్టే.. బీజేపీలో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ కట్టడి చేసి విజయం సొంతం చేసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త సీఎం ఎవరు అనేది ఇంకా తేలలేదు. అలాగే మరో బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా ఉంది.. ఆ రాష్ట్రమే మణిపూర్. జాతుల మధ్య విభేదాలు కాస్త ఉగ్రరూపం దాల్చి అల్లర్లు జరిగాయి. వాటిని అదుపు చేయడంలో విఫలమైన సీఎం బీరేన్ సింగ్ ఈనెల 9వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఆయన రాజీనామా చేశారు. బీరేన్ సింగ్ పదవి నుంచి తప్పుకొని మూడు రోజులవుతున్నా కొత్త సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు.
మణిపూర్ లో సాధారణ పరిస్థితిని తీసుకువచ్చే బాధ్యతను బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జి సంబిత్ పాత్ర చేతుల్లో పెట్టింది కాషాయ పార్టీ హైకమాండ్. సంబిత్ పాత్ర ఇంఫాల్లోనే మకాం వేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్, ఇతర ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్ కెబా, ఇబోమ్ చావో మంగళవారం సంబిత్ పాత్రతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య మారణహోమానికి దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పాత్ర సమాచారం సేకరిస్తున్నారు. అలాగే మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, హిల్ ఏరియాస్ కమిటీ చైర్మన్ గంగ్మేయ్తోనూ వేర్వేరుగా పమావేశమయ్యారు. సంబిత్ పాత్రతో సమావేశం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ లో శాంతిని పునరుద్దరించడమే తమ పార్టీ అభిమతమని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏం చేస్తే మణిపూర్ కు మంచి జరుగుతుందో తమ పార్టీ హైకమాండ్ కు తెలుసు అని.. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై అసలు తాము చర్చించనే లేదని చెప్పారు.