లిఫ్ట్, గోడకు మధ్య చిక్కుకుని బాలుడు మృతి
నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థికి చేరిన బాలుడిని ఆస్పత్రికి తరలించినా చికిత్సపొందుతూ మృతి
ప్రమాదవశాత్తు లిఫ్ట్, గోడకు మధ్య చిక్కుకున్నాడు ఆరేళ్ల బాలుడు. రెండున్నర గంటల పాటు నరకయాతన అనుభవించిన బాలుడిని బైటికి తీశారు. అర్ణవ్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతిని ఆస్పత్రి సూపరిండెంట్ నిర్ధారించారు.హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్కుమార్ కుమారుడు అర్ణవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి రెడ్హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3 అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండటంతో బాలుగు చొరవ తీసుకుని లిఫ్టులో గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. తాత లగేజీ పెట్టేలోపే లిఫ్టు ఒక్కసారిగా పైకి వెళ్తుండటంతో భయంతో బైటికి రావడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోగా.. కదిలే వీల్లేని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్కు, మొదటి అంతస్తుకు మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. అర్ణవ్ హాహాకారాలు, మనవడిని రక్షించండి అంటూ తాత అరుపులతో అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. నాంపల్లి ఎస్ఐ అప్పలనాయుడు, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హుటాహుటిన అక్కడి చేరుకోవడంతో పాటు డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను, 108 అంబులెన్స్ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. మొదట గ్యాస్ కట్టర్తో లిఫ్టు గ్రిల్స్ తొలించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో పెట్టుని చివరికి లిఫ్ట్ గోడను బద్దలు కొట్టారు. సుమారు 90 నిమిషాలు శ్రమించి అతికష్టంపై బాలుడిని బైటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థికి చేరిన బాలుడికి 108 వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆస్పత్రికి తరలించిది. ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.