పాక్ జైలు నుంచి భారత మత్స్యకారులు విడుదల
మాలిర్ జైలు నుంచి విడుదలైన 22 మంది
అరేబియా సముద్రంలో చేపలు వేటాడుతూ అంతర్జాతీయ జల సరిహద్దును దాటి పాక్ జలాల్లో అడుగు పెట్టి జైలు శిక్ష అనుభవిస్తోన్న 22 మంది భారతీయ మత్స్యకారులను విడుల చేశారు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు. పొరపాటున పాక్ తీర జలాల్లో అడుగు పెట్టిన భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి కరాచీ కోర్టు శిక్ష విధించగా ఇన్ని రోజులు జైళ్లో గడిపారు. ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు లేకుండా పాక్ తీర జలాల్లోకి వస్తోన్న మత్స్యకారులపై స్థానిక ప్రభుత్వం దయతో వ్యవహరించాలని ఈదీ ఫౌండేషన్ చైర్మన్ ఫైజల్ ఈదీ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాలు మత్స్యకారుల విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని కోరారు. కరాచీ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులకు ఫైజల్ ఈదీ ప్రయాణ ఖర్చులు, కొన్ని వస్తువులు అందజేశారు. వారిని వాఘా సరిహద్దుల వరకు తరలించేందుకు అవసరమైన తోడ్పాటు అందించారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు మత్స్యకారులను భారత అధికారులను అప్పగించనున్నారు.