భూపాలపల్లి జిల్లా ఉత్తర్వులను కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్ పిటిషన్
ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడుతామని ప్రశ్నించిన హైకోర్టు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజలింగమూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీశ్రావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని న్యాయమూర్తి చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడుతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. వాదనలు వినిపించేందుకు గడవు ఇవ్వాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.