ప్రధాని మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? : ఎమ్మెల్సీ కవిత
బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు నాటకాలు ఆడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికే ప్రధాని మోదీ బీసీనా.. కాదా..? అనే చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెర లేపారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. రెండు జాతీయ పార్టీలను ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు.
మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? అని ఆమె ప్రశ్నించారు. బీసీల జనాభాను కరెక్టుగా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో శాసన సభలో సీఎం రేవంత్రెడ్డి బిల్లు పెట్టాలని, దాన్ని కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆమోదించాలని అన్నారు. ఆ ప్రాసెస్ చేయకుండా నరేంద్ర మోదీ కులం గురించి, రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడుకుంటున్నారని కవిత మండిపడ్డారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని హెచ్చరించారు. వంకర టింకర మాటలు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన 14 నెలల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తోందని కవిత ఆరోపించారు.