ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం : బండి సంజయ్
ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని బండి సంజయ్ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనపేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని తాము ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు. బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు.
నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు.కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారని ఆయన అన్నారు. కరీంనగర్ సునీల్రావు కచ్చితంగా పార్టీ మారుతాడని మాకు ముందే సమాచారం ఉన్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రెండున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సునీల్ రావు కేవలం పదవుల కోసమే పార్టీలో చేరుతున్నాడని చెప్పినా అధిష్ఠానం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీ నుంచి వెళ్లిపోతేనే బీఆర్ఎస్ మరింత పటిష్ఠపడుతుందన్నారు. పార్టీ మారిన సునీల్ రావు అవినీతిపై తాము దృష్టి సారిస్తామన్నారు. దొడ్డిదారిన వచ్చి వెళ్లిన వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.