ఏడాది పాలనలో ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారు
రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించిన ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలకపాత్ర అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకుని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయకు చెప్పారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు. ఫామ్హౌస్లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు.. ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఏడాదిలోనే మేం ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటిపై వాళ్లే కేసులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చింది. 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదు. మా ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేశామని సీఎం అన్నారు.
చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడల్లో యువత రాణించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ఖు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి 2. కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశాం. క్రికెటర్ సిరాజ్కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చాం. పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ జివాంజీ దీప్తి ఇంటిస్థలంతో పాటు రూ. 25 లక్షలు ఇచ్చామని రేవంత్ గుర్తు చేశారు.
26.50 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ వచ్చి ఉంటే కాంగ్రెస్ ఓటు వేయాలి. లేకపోతే వేరే పార్టీకి వేయాలని ఓటర్లను కోరారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు. ఆ అప్పులకు ప్రతి నెల రూ. 600 కోట్లు వడ్ఈ చెల్లిస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాలేదు. ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్ రూ. 8 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. రాహుల్గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశాం. వందేళ్లుగా జరగని కులగణను సమర్థంగా నిర్వహించామని రేవంత్ అన్నారు.