బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం
భక్తులకు దర్శనం ఇస్తున్న స్వర్ణగోపురం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వర్ణ దివ్యవిమాన గోపురానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ దేవాలయాన్ని దర్శించుకున్న సీఎం దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వర్ణతాపడం కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు.సామాన్యభక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వర్ణగోపురం ఆవిష్కరణలో భాగంగా ఈ నెల 19న నుంచి మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ప్రసిద్ధ చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు.యాదాద్రి ఆలయం విద్యుత్ కాంతుల వెలుగుల్లో విరాజిల్లుతున్నది.గోవందనామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కంభం అనిల్కుమార్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ మహాక్రతువు చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోనే ఎత్తయిన ప్రథమ స్వర్ణతాపడ గోపురం ఇదే. విమానంపై ఉన్న నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి.
