Telugu Global
Sports

టీ 20 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌.. పాక్‌ పై ఇండియా ఘన విజయం

వరల్డ్‌ కప్‌ లో బోణీ కొట్టిన భారత్‌

టీ 20 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌.. పాక్‌ పై ఇండియా ఘన విజయం
X

టీ 20 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై భారత్‌ అన్నిరంగాల్లో ఆధిపత్యం కనబరిచింది. ఆరు వికెట్ల తేడాతో పాక్‌ పై విజయం సాధించింది. 106 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చేదించింది. విజయానికి మరో రెండు పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. స్టంప్‌ ఔట్‌ నుంచి రక్షించుకునే క్రమంలో కింద పడ్డ కౌర్‌ మెడకు గాయం కావడంతో 29 పరుగుల వద్ద పెవిలియన్‌ కు వెళ్లిపోయారు. ఆమె స్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చిన సజన ఫోర్‌ కొట్టి విజయానికి అవసరమైన లాంఛనం పూర్తి చేశారు. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ షెఫాలి వర్మ 35 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశారు. జేమియా రోడ్రిగ్స్‌ 23 పరులు చేశారు. స్మృతి మంథన, దీప్తి శర్మ ఏడేసి పరుగులు చేశారు. రిచా గోష్‌ డకౌట్‌ అయ్యారు. పాకిస్థాన్‌ బౌలర్లలో ఫాతిమా సనా నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. సాదియా ఇక్బాల్‌, ఓమైమా ఇక్బాల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.





టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ను భారత బౌలర్లు 105 పరుగులకే పరిమితం చేశారు. ఒకానొక దశలో పాకిస్థాన్‌ వంద స్కోర్‌ సాధిస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. నిదా దార్‌, సయేదా అరుబ్‌ షా తో కలిసి ఎనిమిదో వికెట్‌ కు 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం.. నర్షా సందు చివరి రెండు బాల్స్‌ కు ఆరు పరుగులు రాబట్టడంతో పాకిస్థాన్‌ వంద మార్క్‌ అధిగమించింది. పాకిస్థాన్‌ బ్యాటర్‌ లలో నిదా దార్‌ 34 బాల్స్‌ లో ఒక ఫోర్‌ తో 28 పరుగులు చేయగా, ముబీనా అలీ 17, అరేబ్‌ షా 14, ఫాతిమా సనా 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోర్‌ చేయలేదు. ఇద్దరు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. భారత బౌలర్లలో అరుందతి రెడ్డి 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక పటేల్‌ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నారు. రేణుకా సింగ్‌, దీప్తి శర్మ, ఆశ శోభన ఒక్కో వికెట్ పడగొట్టారు.

First Published:  6 Oct 2024 1:33 PM GMT
Next Story