Telugu Global
National

ఎస్సీల వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్లు సుప్రీం కొట్టివేత

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎస్సీల వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్లు సుప్రీం కొట్టివేత
X

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ‘‘పిటిషన్లు అన్నింటినీ పరిశీలించాం. తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే వాటిని కొట్టివేస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్‌ సర్కార్ యాక్ట్ తీసుకొచ్చింది. అలాంటి ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్‌-హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది.

ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్‌ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దానిని సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ కూడా ఇందులో ఒక పిటిషనర్‌గా ఉన్నారు. పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో దీనిని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం దీని విచారణను చేపట్టి.. 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

First Published:  4 Oct 2024 12:48 PM GMT
Next Story