ప్రాపంచిక దూరాలను తగ్గించడంలో సూఫీ సంప్రదాయాలు వారధి
జహాన్-ఏ-ఖుస్రో 25 వ వార్షిక వేడుకలో పాల్గొన్నప్రధాని

భారత ఉమ్మడి వారసత్వంలో భాగంగా మారిన సూఫీ సాంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 13వ శతాబ్దపు ప్రముఖ సూఫీ కవి అమీర్ ఖుస్రో జ్ఞాపకార్థం ఢిల్లీలో నిర్వహించిన జహాన్-ఏ-ఖుస్రో 25 వ వార్షిక వేడుకలో ప్రధాని పాల్గొన్నారు. నిజాముద్దీన్ అవులియా, రూమీ, రస్ ఖాన్ వంటి సూఫీ సాధువులు ముస్లింలుగా పుట్టినా అద్భుతమైన గేయాలు రాసి శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చారని మోడీ ప్రశంసించారు. సూఫీ సాధువులు మసీదులు, దర్గాలకే పరిమితం కాకుండా పవిత్ర ఖురాన్ ఆయత్లను వల్లిస్తూనే వేదాలు కూడా వినేవారని అన్నారు. సంస్కృతాన్ని ప్రపంచ ఉత్తమ భాషగా పేర్కొన్న అమీర్ ఖుస్రో భారత్ను గొప్పదేశంగా అభివర్ణించినట్టు మోడీ గుర్తు చేశారు. ప్రజలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ప్రజల మధ్య ప్రాపంచిక దూరాలను తగ్గించడంలో సూఫీ సంప్రదాయాలు వారధి లాంటివన్నారు.