Telugu Global
National

వాహనదారులకు గుడ్ న్యూస్..త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 నుంచి రూ.3 వరకూ తగ్గించే ఛాన్స్ ఉంది.

వాహనదారులకు గుడ్ న్యూస్..త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
X

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్నాది. ప్రభుత్వరంగ సంస్థలు ఇంధనంపై రూ.2 నుంచి రూ.3 వరకూ తగ్గించే ఛాన్స్ ఉంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర సెప్టెంబర్‌లో సగటున 74 డాలర్లుగా ఉంది. మార్చిలో బ్యారెల్ చమురు ధర 83 నుంచి 84 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించారు.అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి అయ్యే ముడి చమురు ధరలు తగ్గడంతో గత కొన్ని వారాలుగా భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు పెరిగినట్లు 'ఇక్రా' వెల్లడించింది.

క్రూడాయిల్ ధరలు ప్రస్తుత రేటు వద్దనే స్థిరంగా కొనసాగుతున్నట్లయితే ఇంధన ధరలను తగ్గించే అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని 'ఇక్రా' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ పేర్కొన్నారు. మార్చిలో ధరలు తగ్గించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మహాయుతి పక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్‌ ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నదని తెలుస్తున్నది.

First Published:  26 Sept 2024 10:23 AM GMT
Next Story