వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెత్తబడ్డారు. అధిష్టానం ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కు తీసుకున్నారు. దీంతో వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసిపోయినట్టే అనుకోవాలి. వాసుపల్లి రాజీనామా అనంతరం వెంటనే అధిష్టానం రంగంలోకి దిగడం, నష్టనివారణ చర్యలు చేపట్టడం, ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడటంతో సమస్య పెద్దది కాకముందే పరిష్కారం లభించింది.
వాసుపల్లి లేఖ సారాంశం..
“ప్రజా నేతగా, ప్రజల కష్టాలనే పరమావధిగా భావించే మీరు, మరోసారి ప్రజల పక్షాన నిలిచారు. నాకు అండగా నిలిచారు. సమన్వయంతో పరిష్కారం చూపారు. మరింతగా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. సమష్టి తత్వంతో, తమరు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతాను. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా. రాజీనామా ఉపసంహరించుకుంటున్నా.” ఇలా సీఎం జగన్ కి లేఖ రాశారు వాసుపల్లి గణేష్ కుమార్.
తాడేపల్లిలో సయోధ్య..
వాసుపల్లి గణేష్ రాజీనామా అనంతరం.. నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ ని పిలిపించి మాట్లాడారు సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, అయితే వాసుపల్లి పార్టీ నేతలకు టచ్ లోకి రాలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత వాసుపల్లితో సీఎం జగన్ నేరుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అధినేత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానంటూ ఆయన లేఖ రాశారంటే.. జగన్ మాటలకు వాసుపల్లి మెత్తబడినట్టే అర్థమవుతోంది. మొత్తమ్మీద వాసుపల్లి అలకతో రాజకీయ లాభం పొందుతామనుకున్న టీడీపీ ఆశలు మాత్రం ఫలించలేదు. ఆయన తిరిగి వైసీపీకే ఫిక్స్ అయ్యారు. వైసీపీలో విశాఖ రాజకీయ అలజడి టీ కప్పులో తుపానులా తేలిపోయింది.
ALSO READ: పవన్.. మీరు పోరాడేది పొత్తుల కోసమా? – మంత్రి రోజా