Telugu Global
Andhra Pradesh

అది కుల మీడియా.. విజయసాయి ఘాటు ట్వీట్

వైసీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నారంటూ ఆయా ఛానెళ్లపై ఎంపీ విజయసాయి విమర్శలు ఎక్కుపెట్టారు.

అది కుల మీడియా.. విజయసాయి ఘాటు ట్వీట్
X

విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై అసత్య కథనాలు ప్రసారం చేయొద్దంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు 9 టీవీ ఛానెళ్లకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రసారమైన కథనాలను బ్లాక్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఆయా ఛానెళ్లపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయి రెడ్డి. అది కులమీడియా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఏపీ సీఎం చంద్రబాబుని సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకే ఆ కుల మీడియా ప్రయత్నిస్తోందని అన్నారు విజయసాయిరెడ్డి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈ టీవీ, ఆర్ టీవీ.. వంటి కులమీడియా సంస్థల యజమానులు చంద్రబాబు మెప్పుకోసం తీవ్రంగా పోటీపడుతున్నారని, ఈ క్రమంలో నీతిబాహ్యమైన కథనాలిస్తున్నారని మండిపడ్డారు. దుష్టపన్నాగాలు పన్నుతూ, బరితెగించి వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. రాజకీయ వాతావరణాన్ని కూడా స్వార్థంతో కలుషితం చేస్తున్నారని అన్నారు విజయసాయి రెడ్డి.

వైసీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నారంటూ ఆయా ఛానెళ్లపై ఎంపీ విజయసాయి విమర్శలు ఎక్కుపెట్టారు. వాస్తవాలు పట్టించుకుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, జర్నలిజం నిబద్ధతను గాలికొదిలేశారని అన్నారు. కట్టుకథలను ప్రసారం చేస్తూ, పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం తెచ్చారని చెప్పారు. వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. ఆ కుల మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి సత్యానికి పాతరేస్తోందని అన్నారు విజయసాయిరెడ్డి.

First Published:  14 Aug 2024 9:55 AM GMT
Next Story