Telugu Global
Andhra Pradesh

విద్యా వ్యవస్థ ప్రక్షాళణ.. 'నాడు-నేడు'పై విచారణ

వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు కూడా దారుణంగా పడిపోయాయన్నారు మంత్రి లోకేష్. నాడు-నేడులో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని.. అన్నింటినీ తాము సరిచేస్తామన్నారు.

విద్యా వ్యవస్థ ప్రక్షాళణ.. నాడు-నేడుపై విచారణ
X

ఏపీ అసెంబ్లీ రెండోరోజు సమావేశాల్లో గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు ఎమ్మెల్యేలు, మంత్రులు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గందరగోళం సృష్టించిందని ఆరోపించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 'నాడు-నేడు' పనులపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారాయన. ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించారు. నాడు-నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి దోచుకున్నారని చెప్పారు. అవసరం లేకపోయినా కొన్నిచోట్ల పనులు చేశారని ఆరోపించారు. పనులు చేసిన స్కూల్స్ ని కూడా తర్వాత మూసివేశారని, నిధుల వృథా భారీగా జరిగిందన్నారు. ఈ పనులపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. నాడు-నేడుపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.


గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు మంత్రి లోకేష్. తొలి ఏడాదిలోనే కేజీ టు పీజీ వ్యవస్థను ప్రక్షాళణ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. అందుకే మెగా డీఎస్సీ వేసి ఉద్యోగా నియామకాలు చేపట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు లోకేష్.


వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు కూడా దారుణంగా పడిపోయాయన్నారు మంత్రి లోకేష్. 2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో 80శాతం అడ్మిషన్లు జరిగాయని, వైసీపీ హయాంలో ఆ అడ్మిషన్ల శాతం 59కి పడిపోయిందన్నారు. 2019 టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి, 38,98,000 మంది ప్రభుత్వ బడుల్లో చుదువుకుంటుంటే, 2024లో 38,26,000 మందికి ఆ సంఖ్య తగ్గిందన్నారు. నాడు-నేడుతో మంచి జరిగితే 72,000 మంది ప్రభుత్వ బడుల నుంచి ఎందుకు వెళ్ళిపోయారని ప్రశ్నించారు లోకేష్. నాడు-నేడులో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని.. అన్నింటినీ తాము సరిచేస్తామన్నారు.



First Published:  23 July 2024 8:11 AM GMT
Next Story