అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు
రేవంత్ ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది : ఎమ్మెల్సీ కవిత
అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మం జైలులో నిర్బంధంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర నాయకులతో కలిసి శనివారం ఆమె పరామర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతోన్న నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఎవరూ ఆపలేరని.. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని.. ఆ భయంతోనే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారనే సురేందర్పై కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపడం చేతగాకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ క్యాడర్కు, లీడర్లకు ఎళ్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. కవిత వెంట మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, హరిప్రియ నాయక్, నాయకులు దిండిగాల రాజేందర్, లింగాల కమల్ రాజ్, గుండాల కృష్ణ, బొమ్మెర రాంమూర్తి, బెల్లం వేణు తదితరులు ఉన్నారు.
సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి పాండురంగాపురంలోని సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట నాయకులు శేషగిరిరావు, వేణు, అశోక్ రావు, నరేందర్ తదితరులు ఉన్నారు.