11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు?
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారని సీఎం ఫైర్
తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించింది ఏమిటి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారు. ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఒకటి కిషన్ రెడ్డికి.. మరొకటి బండి సంజయ్కి. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిది? అని నిలదీశారు.
మా ప్రభుత్వం వచ్చాక మొత్తం 55,163 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేశాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్ నిర్వహించాం. 11 వేల మంది టీచర్ల నియామకం చేపట్టాం. పోలీస్ శాఖలో 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6 వేలకు పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించాం. నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓటు వేయేద్దు. నిజమని నమ్మితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండని కోరారు.
గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ-రేసు కేసులు పెడితే.. పేపర్లన్నింటినీ ఈడీ తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు భారత్కు రప్పించడం లేదు. వాళ్లను మన దేశానికి రప్పించండి. ట్యాపింగ్ కేసులో ఏం చేయాలో మేం అది చేస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడ్డంగా పడుకుంటున్ఆరు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారు. హైటెక్ సిటీ కట్టింది మేమే. ఫ్యూచర్ సిటీ కట్టేది కూడా మేమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.