'కాళరాత్రి దేవి' అవతారంలో బాసర సరస్వతి అమ్మవారు
మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం మూలా నక్షత్రం సందర్బంగా అమ్మవారు 'కాళరాత్రి దేవి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి విశేష మూలా నక్షత్ర యుక్త అష్టోత్తరనామార్చన పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో చిన్నారులకు అధికారులు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో దర్శనానికి దాదాపు గంట సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు క్యూలైన్లో ఉన్నవారికి మంచినీళ్లు అందిస్తున్నారు.