సెంటీమీటర్ సొరంగం తవ్వడం చేతకాని ప్రభుత్వం : కేటీఆర్
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు.;
శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణమం మాజీ సీఎం కేసీఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం రేవంత్ 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తిచేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటుని పేర్కొన్నారు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి, తన వైఫల్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం. కనీస ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి, నాలుగు రోజులు కాకముందే ఎనిమిది మంది అమాయకుల నిండు ప్రాణాలను ఫణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదే ని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా ఫైరయ్యారు.
మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లయితే, 2005-2014 వరకున్న గత కాంగ్రెస్ సర్కారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లే అన్నారు. సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా, ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు రూ.3300 కోట్ల ఖర్చుచేస్తే, బీఆర్ఎస్ పాలనలో రూ.3900 కోట్ల పనులు పూర్తిచేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవాచేశారు. గత కాంగ్రెస్ సర్కారుకన్నా రూ.600 కోట్లు ఎక్కువ ఖర్చుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడున్నరేండ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా, ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలా లేవని వెల్లడించారు. రైతులకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాకుండా.. గల్లీ నుంచి ఢిల్లీదాకా కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని అర్ధాంతరంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి ముందు మరో మార్గం లేదని చెప్పారు. ఈ డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.